ఇందుగలడందులేడని
సందేహము వలదు
చక్రి సర్వోపహతుండు
ఎందెందు వెదకి చూచిన
అందందేగలడు దానవాగ్రణి వింటే
అన్నాడు ప్రహ్లాదుడు
నరసింహా వతారమై
వుగ్రరూపమై
స్థంభంలోంచీ
పరమాత్మ ప్రకటమయ్యాడు.
ఓరుగల్లు సామ్రాజ్జాధిపతి
ప్రతాప రుద్రుడు శివభక్తుడు
ప్రతిరోజూ ఒక కొత్త బంగారు శివలింగంతో
అభిషేకం చేసేవాడు
అది తరువాత బ్రాహ్మణునికి దానం చేసేవాడు
అహోబిల క్షేత్రం మీద వెళుతుండగా తెల్లవారింది
కంసలిని పిలిచి
త్వరగా ఒక శివలింగం చేసి పట్టుకురమ్మన్నాడు
ఎంతసేపైనా రాడా కంసలివాడు
ఏం జరుగుతుందో తెలియట్లేదు ప్రభూ
ఎంత ప్రయత్నించినా బంగారు పోత పోస్తే
అది శివలింగం కాకుండా
నరసిం హ స్వామిగా మారిపోతోంది..
అన్నాడు వణికిపోతూ..
చేసేది లేక
నరసిం హ స్వామికే అభిషేకం చేసి ధ్యానం చేసాడు
అపుడు నరసిం హ స్వామి దర్శనమైంది..
ఇదంతా నా క్షేత్రం
ఇక్కడ నేనే వుంటాను
నేను వేరు శివుడు వేరు కాదు..
అన్నాడు
అటువంటి వాడు నరసింహు డు..
ఆ నరసింహు నిపై పుట్టపర్తి కనకమ్మ గారికి
అంటే మా అమ్మకు ఎనలేని ప్రేమ
అంతటి వాడినీ పసివాణ్ణి చేసి జోలపాడిందా తల్లి..
తొలి సంతానం పై తల్లి కి ఎంతప్రేమో
మా పెద్దక్కయ్యకు పెండ్లి చేసినప్పుడు.
ఆమె అత్తగారింటి ఇంటిదేవుడు
లక్ష్మీ నరసిం హ స్వామి..
అందుకే అక్కయ్యకోసం
మురిపెంగా అమ్మ ఈ పాటను వ్రాసింది..
రచన : శ్రీమాన్ పుట్టపర్తి నారాయణా చార్యులు
గానం : ధర్మరాజు వంశీ ప్రియ
లక్ష్మీనృసింహ లాలీ భక్తులను
లాలించు తండ్రి లాలీ
సూక్ష్మావతార లాలీ చోళంగి
శ్రీనికేతనుడ లాలీ
పట్టుపర్యంకమందు శ్రీదేవి
పట్టుపునుగులు చిలుకగా
అమృతవల్లిని గూడుచూ నరసిమ్హ
అలత దీరగ నుండుమా
అలసివచ్చినవాడవూనరసింహ
అలపెల్ల దీరగానూ
అలన శ్రె సతి హాసమే పూవులై
అలరారు గళమునందు
ఇరవుగా భూతలమునా నిలువగా
సరసమౌ వసతిలేక
గరుడాద్రి శిఖరి నుండి ఆశ్రితుల
గమనించి బ్రోతువయ్యా
వేదములె కోళ్ళుగానూ మంచమున
నాదిశలె పట్టెలుగను
శ్రీదేవి పానుపుగను భువనంపు
బాధలే మరువవయ్యా..
భక్తులర్పించు పాలు పండ్లును
రక్తితో గ్రహియించుచూ
లోకంపు జాడలరసి ఏకాంత
చిత్తమున దలపోయుమా
వేగిలేచినది మొదలు వేదనల
క్రాగి నవసెడి భక్తులా
బాధలను రూపుమాపి నీవెంతొ
బడలినావయ్య దేవా
తిన్నగా నవ్వెనేమో పెదవిపై
వెన్నెలలె వెల్లిగొనెను
కన్నతండ్రికి నిదురలో మనసులో
ఎన్నెన్ని ఊహలమ్మా
అలివేణులార మీరు కరములను
ఆలవట్టముల బూని
అలసిన నరసిం హు ని విసరరే
అలక దీరంగ నిపుడూ
సరసంపు మాటలాడి నరహరి
సిరిగూడి నిదురింపగా
అరమోడ్పు కన్నుగవను చూడుడీ
దరహాస మిగురించెను
అభిలార్తి హర నృసింహ
అమృత శ్రీ నారసింహ
గరుడాద్రి నారసింహ నిదురింప
కమలాక్ష శ్రీ నృసింహ
పరమ తారకమైన యీ నరసింహ
భక్తి గీతము బాడుచూ
నరహరిని కీర్తింపగా వారికా
నృహరి సాయుజ్యయుక్తి..
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి